చెప్పుకోలేని బాధ... జీహెచ్ఎంసీలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల వ్యధ

by Disha Web Desk |
చెప్పుకోలేని బాధ... జీహెచ్ఎంసీలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల వ్యధ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నిద్ర లేచింది మొదలు రోడ్లపైకి వచ్చి పని చేసే మహిళా పారిశుధ్య కార్మికులు పడరాని కష్టాలు పడుతున్నారు. చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. ఇది జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పని చేస్తున్న సుమారు 20 వేల మంది పారిశుధ్య కార్మికుల దుస్థితి. బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్ మియాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళితే ఉద్యోగం ఎక్కడ తొలగిస్తారోనని భయపడుతున్నారు.

అక్కడక్కడా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా ...

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అక్కడక్కడా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా అవి నగరంలో అన్ని చోట్ల అవసరాల మేరకు లేవు. దీంతో ఒక్కోసారి కిలోమీటర్ల దూరం టాయిలెట్లను వెతుక్కుంటూవెళ్లవలసి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి మహిళలకు ఉపయోగపడేలా మరిన్ని పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

20 ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నాం

మూత్ర విసర్జనకు సౌకర్యాలు లేక 20 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని బల్దియాలో పని చేసే పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసే చోట మంచి నీటి వసతి ఉండదని, ఉన్నా నీళ్లు తాగితే మూత్రం వస్తుందనే భయంతో తాగడం లేదని తెలిపారు. నెక్లెస్ రోడ్డులో పని చేసే సమయంలో ఎన్టీఆర్ పార్క్ వైపు మాత్రమే టాయిలెట్లు ఉన్నాయని, వాటి ముందు దుకాణాలు ఉండడంతో కొన్ని సందర్భాలలో దుర్వాసన వస్తుందని టాయిలెట్లకు వ్యాపారులు తాళాలు వేస్తున్నారని తెలిపారు. ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదని, నగర వ్యాప్తంగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరిదని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తాము పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు.


Next Story

Most Viewed